తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన ఏడు కొండలపై  కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఉన్నది .  క్రీ.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు ఆలయం  నిర్మించారు .

మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో  ఏడు కొండల మధ్యన  వెలసిన స్వయంబువంపై వెంకటేశ్వరస్వామి లక్ష్మి సమేతంగా వెలిసినారు పేదల తిరుమల తిరుపతిగా ఇక్కడ మొక్కులు అందుకుంటున్నారు.

గతంలో కురుమూర్తి కి కురుమతి అను పేరు ఉన్నట్లు దేవాలయ గత చరిత్ర తెలుస్తోంది. కాంచన గుహగా పేరున్న కురుమూర్తి కొండలలో ఉన్న వెంకటేశ్వర స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజున అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు



కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం చరిత్ర

మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో ఏడుకొండల మధ్య స్వయంభూవంపై వెంకటేశ్వరస్వామి లక్ష్మి సమేతంగా వెలిసిన స్వామి పేదల తిరుమల  తిరుపతిగా మొక్కులు అందుకుంటున్నాడు. కురుమూర్తి వేంకటేశ్వర స్వామి దేవస్థానం సా''.శ''. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించారు.  1350లో చంద్రారెడ్డి  కురుమూర్తి వేంకటేశ్వర స్వామి దేవస్థానం ను  అభివృద్ధిపర్చగా, సోమభూపాలరావు కురుమూర్తి  దేవస్థానం కొండపైకి మెట్లు నిర్మించి ప్రతి ఏటా జాతర నిర్వహించే సాంప్రదాయం తెచ్చాడు.

 1870లో ఉద్దాల మండపం ను ఏర్పాటు చేసినారు . కురుమూర్తి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు చేయటం  ప్రధాన ఘట్టం. ఈ వేడుకలు ప్రతి ఏటా మండల పరిధిలోని వడ్డేమాన్ నుండి  ప్రారంభమవుతాయి. ఆ పాదుకలను ఈ ఉద్దాల మండపంలో ఉంచుతారు. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే సమస్త పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. 1999లో నూతనంగా మండపం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వరస్వామి లక్ష్మి సమేతంగా వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు. 1966లో ఈ దేవస్థానం దేవాదాయ శాఖలో విలీనం చేయబడింది.


కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం పురాణ కథలు

ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వెంకటేశ్వరస్వామి పెళ్ళి చేసుకోడానికి కుబేరుని వద్ద అప్పుచేసి, అప్పు తీర్చడంలో మాట తప్పానని మనస్థాపం చెందిన వెంకటేశ్వరస్వామి కృష్ణానదీ తీరం వెంట వెళ్తూ  జూరాల దగ్గర లోని గుండాల జలపాతం వద్ద స్నానం చేశాడు. అక్కడ నుండి  ఉత్తర దిశగా వెళ్తున్న సమయంలో లక్ష్మీదేవి కోరిక గుర్తురావడంతో అక్కడే  ‘కురుమూర్తి గిరుల’పై విశ్రమించి అక్కడ్నించి తిరిగి వెళ్ళుతున్నపుడు  తన  ప్రతిరూపాలను మాత్రం ఇక్కడే కురుమూర్తి గిరులపై వదిలి వెళ్ళారని స్థల పురాణం తెలుపుతుంది .


కుబేరుని అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి తిరుపతి నుంచి ఉత్తరముఖంగా ఇక్కడికి వస్తున్న వెంకటేశ్వరస్వామి ఆ సమయంలో సుగంధ భరిత నానాఫల పక్షాలతో కనిపించిన  గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి అడిగిన వెంటనే స్వామి ఇక్కడ ఆగినట్టు పురాణ గాథ. ఇక్కడ ‘కురు’ అనగా చేయుట, ‘మతి’ అనగా తలచుట అని అర్థం. అందుకే ఈ వెంకటేశ్వరస్వామి కి ‘కురుమతి’ అని పేరు వచ్చింది. అలా కాలక్రమేణా అది ‘కురుమూర్తి’గా స్థిరపడి పోయినట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఇలా పద్మావతి సమేతంగా తిరుమల వీడి కృష్ణాతీరం చేరిన శ్రీ వేంకటేశ్వరుడు నదిలో సేద తీరిన అనంతరం వెంకటేశ్వరస్వామి కి పాదాలు కంది పోకుండా కృష్ణమ్మ పాదుకలు బహుకరించిందని, ఈ పాదుకలనే ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని చరిత్రాత్మక కథనం ప్రచారంలో ఉన్నది . నాడు శ్రీ వెంకటేశ్వరస్వామి లక్ష్మీదేవి  సమేతంగా కృష్ణానదిలో స్నానమాడిన ప్రదేశం నేడు ఆత్మకూరు ప్రదేశంలో గుండాల జలాశయంగా ప్రసిద్ధి కెక్కినది 

తిరుమలకు కురుమూర్తికి పోలికలు:

*తిరుపతి లో విధంగా  ఇక్కడా విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు.

*తిరుపతిలో ఉన్నవిధముగా  ఇక్కడ కూడా ఏడు కొండల మద్య వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు.

*తిరుపతిలో ఉన్న విధంగా  ఇక్కడా స్వామి నిలుచున్న భంగిమలో ఉన్నాడు.

*తిరుమల నడక బాటలో  మెట్లపై వెళ్ళేటప్పుడు ఉన్న శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి

*కురుమూర్తి దర్శనానికి నడక మార్గం వెళ్ళ్తున్నప్పుడు మోకాళ్ళ గుండు ఉన్నది .

*శేషశైలంలోలాగే స్వామి వారికి అలిపిరి మండపం ఉన్నట్టు ఇక్కడ ఉద్దాల మండపం ఉంది.


కురుమూర్తి దేవాలయానికి చేరు విధానం :

*తెలంగాణ రాష్ట్రం జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 *మహబూబ్‌నగర్ నుంచి రోడ్డు మార్గమున  దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు 

*కురుమూర్తి రైల్వేస్టేషన్ నుంచి ఆలయం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.

*7 వ నెంబర్ జాతీయ రహదారి పై ఉన్న కొత్తకోట వద్ద నుంచి కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా వెళ్ళినచో 18 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది.