అష్టాదశ శక్తి పీఠాల గురించి పూర్తి వివరాలు
పరమ శివుని యొక్క అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి మరియు మనం పూజిస్తున్నాం.
ఒక శక్తి పీఠం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో (గుడి ధ్వంసం అయ్యింది). మరొకటి శ్రీలంకలో ఉంది. మిగతా 16 ” శక్తి పీఠాలు “మన దేశంలోనే ఉన్నాయి.
1. లంకాయాం శాంకరీదేవి
అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా మనము నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి.
నేటి శ్రీలంకలో పశ్చిమతీరాన గల ట్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్లున్న కొండపైన శాంకరీదేవి ఆలయం మరియు శక్తి పీఠం ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అని కూడా అంటారు.
ఇది అమ్మవారి ‘తొడ భాగం’ పడిన స్థలంగా ప్రతీతి.
2. కామాక్షీ కాంచికా పురే
కోర్కెలు తీర్చే కన్నులు గల శక్తి స్వరూపిణి కామాక్షి దేవి .
ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణానికి 75 కి.మీ దూరంలో కాంచీపురంలో వెలగొందుతోంది. ఈ అమ్మవారి శరీరభాగమైన ‘కంకాళం’ ఇక్కడ పడినట్లు చెబుతారు.
3. ప్రద్యుమ్నే శృంఖలాదేవి
నేటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు సుమారు 85 కి.మీ దూరంలో హుగ్లీ జిల్లాలోని ‘పాండువా’ అనే గ్రామంలో క్షేత్రం వెలసిందీ . మహమ్మదీయ పాలనలో గుడిని ధ్వంసం చేసి, పైన మీనార్ను నిర్మించారు. దీంతో భారత ప్రభుత్వం నిషేధిత స్థలంగా ప్రకటించింది. శృంఖల అంటే సంకెళ్లు అని అర్థం.
భక్తుల సమస్యల సంకెళ్లను అమ్మవారు త్రుంచివేస్తారని ఒక నమ్మకం.
అమ్మవారి శరీర భాగమైన ‘ఉదరం’ ఇక్కడ పడిందని చెబుతారు. పాండువా గ్రామానికి 10 కి.మీ దూరంలో హంసాదేవి అనే అతి ప్రాచీన దేవాలయం కూడా ఉంది.
భక్తులు హంసాదేవినే శృంఖలాదేవిగా భావించి పూజలు జరుపుతుంటారు.
4. క్రౌంచపట్టణే చాముండేశ్వరి
కర్ణాటక రాష్ట్రం మైసూరు పట్టణంలో మహిషాసుర మర్దినిగా చాముండేశ్వరి మాత వెలుగొందుతోంది. ఆలయానికి ఎదురుగా సర్వాలంకృతుడైన మహిషుని విగ్రహం కూడా ఉన్నది .ఇక్కడ అమ్మవారి యొక్క ‘తలవెంట్రుకలు’ పడిన పుణ్య ప్రదేశం చాముండేశ్వరీ ఆలయం.
5. అలంపురే జోగులాంబ
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో కర్నూలుకు 10 కి.మీ దూరంలో ఉన్న ప్రాచీన ఆలయం అలంపూర్ జోగులాంబ.
ఈ దేవాలయం ముసల్మానుల దండయాత్రలో ధ్వంసం అయ్యి, ఆ తర్వాత తిరిగి పునరుద్ధరించబడింది.ఇక్కడ సతీదేవి ‘దంతాలు’ పడ్డాయని ప్రతీతి.
ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి.
6. శ్రీశైలే భ్రమరాంబికా
దక్షిణాపథంలో ప్రసిద్దికెక్కిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం. కర్నూలుకు 150 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు భ్రమరాంబికగా నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సతీదేవి ‘మెడ’భాగం పడిన స్థలంగా ప్రతీతి.
ఈ ఆలయానికి దగ్గరలోని అడవిలో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయం అతి ప్రాచీనమైనది.
7. కొల్హాపురే మహాలక్ష్మీ
మహారాష్ట్రలోని పుణేకి దాదాపు 300 కి.మీ దూరంలో కొల్హాపూర్లో వెలసిన అమ్మ మహాలక్ష్మి యొక్క అవతారం.
ఇక్కడ సతీదేవి ‘కనులు’ పడిన ప్రాంతంగా చెబుతారు.
8. మాహుర్యే ఏకవీరికా
మాహుర్యే పురమున వెలసిన శక్తి స్వరూపిణి ఏకవీరిక. మహారాష్ట్రలో నాందేడ్ పట్టణానికి 125 కి.మీ దూరంలో మా కుద్యపురం ఉంది . ఇక్కడ అమ్మవారి ‘కుడి చేయి’ పడిన స్థలంగా ప్రతీతి.
9. ఉజ్జయిన్యాం మహాకాళి
సతీదేవి ‘పై పెదవి’ పడిన స్థలం. మధ్యప్రదేశ్లోని ఇండోర్ పట్టణానికి 50 కి.మీ దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లంగం మరియు మహాకాళి ఆలయం ఉన్నాయి. మహిమాన్వితమైన క్షేత్రంగా ఈ ప్రదేశానికి పేరు.
మంత్ర, తంత్రాలతో ప్రతిష్ఠ చేసిన శక్తిపీఠంగా విరాజిల్లుతోంది మహాకాళి.
10. పీఠికాయాం (పిఠాపురం) పురుహూతికా
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోటకు 13 కి.మీ దూరంలోని పిఠాపురంలో సతీదేవి ‘పీఠభాగం’ పడడం వల్ల పీఠికాపురంగా, కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది. శ్రీచక్రం మరియు అమ్మవారికి బంగారు చీర ఇక్కడ ఉన్నాయి.
ఈ చీరతో ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకారం చేస్తారు.
11. ఓఢ్యాయాం గిరిజా దేవి
ఒడ్యాణం అనగా ఓఢ్ర దేశం (ఒరిస్సా).
ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ సమీపంలో వైతరణీనది ఒడ్డున త్రిశక్తి స్వరూపిణి అమ్మవారుగా వెలసింది. ఆ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు.
ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్ నుంచి 20 కి.మీ దూరం ప్రయాణిస్తే గిరిజాదేవి (ఇక్కడ భిరిజాదేవిగా ప్రసిద్ధి) ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ సతీదేవి యొక్క ‘నాభి స్థానం’ పడిందని అంటారు.
12. మాణిక్యామ్ దక్షవాటికే (ద్రాక్షారామం)
ఇక్కడ సతీదేవి యొక్క ‘కణతల భాగం’ పడిన ప్రదేశం. ఈ పుణ్యక్షేత్రం అష్టాదశ పీఠాలలో 12వదిగా, పంచారామాలలో మొదటిదిగా ప్రసిద్ధి .
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు. దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశం ఇది .
భోగానికి, మోక్షానికి మరియు వైభవానికి ప్రసిద్ధి చెందినదీ క్షేత్రం.
13. హరిక్షేత్రే కామరూపా
అస్సాం రాష్ట్రం యొక్క రాజధాని గౌహతి . ఈ క్షేత్రం బ్రహ్మపుత్రానది ఒడ్డున నీలాచలంలో వెలసినదీ . ఇక్కడ సతీదేవి యొక్క ‘యోని’ భాగం పడిన స్థలం. నీలాచలంలో స్త్రీ యోని వంటి శిల ఒకటి ఉన్నది .
ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది. సంవత్సరానికి ఒకసారి మూడు రోజుల పాటు ఎర్రని నీరు కూడా వస్తుంది. అమ్మవారు రజస్వల అయిందని, ఆ మూడు రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు. ఆ నాలుగో రోజున సంప్రోక్షణ కూడా జరుపుతారు.
14. ప్రయాగే మాధవేశ్వరీ
ఈ ప్రయాగ క్షేత్రం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క ‘హస్త అంగుళీయం’ పడిన ప్రాంతంగా కూడా చెబుతారు. యుమన మరియు గంగా నదులు కలిసే ప్రాంతం ఇది . ఇక్కడ శక్తిని మాధవేశ్వరి అని అంటారు. ఈ క్షేత్రం పిండప్రదానానికి మరియు అస్థికల నిమజ్జనానికి ప్రాముఖ్యత గలదీ.
15. జ్వాలాయం వైష్ణవీ దేవి
ఇక్కడ సతీదేవి యొక్క ‘పుర్రె’ పడిన ప్రదేశం. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు 50 కి.మీ దూరంలో కాట్రా అనే ప్రదేశంలో జ్ఞాన క్షేత్రం ప్రాంతం ఉన్నది .
అక్కడి నుండి గుర్రాల మీద లేదా హెలీకాప్టర్లో కొండపైకి వెళ్లి జ్వాలాముఖి లేదా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చును .
ఈ ఆలయంలో గుహ కూడా ఉంది. నాడు మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా చేయించి, తన స్వహస్తాలతో మోస్తూ కొండపైకి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించిన వెండి గొడుగు నేటికీ ఈ ఆలయంలో కూడా ఉంది.
16. గయాయామ్ మాంగళ్య గౌరీ
బీహార్ రాష్ట్రంలో పాట్నాకు 75 కి.మీ. దూరంలో గయా క్షేత్రము ఉన్నది. ఇక్కడ శక్తి స్వరూపిణి మంగళ గౌరి రూపంలో కొలువుదీరి ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క ‘స్తనం’ పడిన ప్రదేశం.
ఇక్కడికి దగ్గరలో బుద్ధగయ, బోధి వృక్షం మరియు బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. ప్రతి హిందువూ గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలని కోరుకుంటాడు.
17. వారాణస్యాం విశాలాక్షీ
ఇక్కడ సతీదేవి యొక్క ‘మణికట్టు’ పడిన స్థలం. ఇది కాశీ పుణ్య క్షేత్రం గా మారినది .
శివుని విశిష్ట స్థానంగా కాశి/వారణాశి విరాజిల్లుతోంది. వరుణ మరియు అసి అనే రెండు నదుల యొక్క సంగమం. గంగాస్నానం, విశ్వేశ్వరుడు మరియు విశాలాక్షి దర్శనం నయానందకరం.
18. కాశ్మీరేతు సరస్వతియనా
ఇక్కడ సతీదేవి యొక్క ‘చేయి’ పడినదని కొందరు, కుడి చెంప పడిన స్థలమని కొందరు చెబుతారు. పురాణేతిహాసాల వల్ల అమ్మవారి ఆలయం కాశ్మీర్లో ఉందని కూడా తెలుస్తోంది.
ఆ ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ పూజలు జరగడం లేదని శంకచార్యులు ఆ పీఠాన్ని శృంగేరిలో (కర్ణాటక రాష్ట్రంలో) ప్రతిష్ఠించారని కూడా తెలుస్తోంది. మంగుళూరుకు 100 కి.మీ దూరంలో సరస్వతి ఆలయ రూపకల్పన చేసి, ఒక రాయిపై చక్రయాత్ర స్థాపన చేసి, సరస్వతీదేవి చందనపు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు.
శక్తి పీఠాల సందర్శన భాగ్యం..
అష్టాదశ శక్తి పీఠాల సందర్శన ఫలితంగా మనశ్శాంతి మరియు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెపుతారు .
అటువంటి 18 పీఠాలను స్వయంగా సందర్శించడం పూర్వజన్మ సుకృతం. ఒక్కో రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఒక్కోటి, ఒక్కోసారి రెండు-మూడు శక్తి పీఠాలను దర్శించి వచ్చను .
దసరా పండగ నాడు ఈ 18 క్షేత్రాలలో శక్తి పూజ కన్నుల పండగగా కూడా జరుగుతుంది.
*శ్రీ మాత్రేనమః..*
No comments